ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : యేసు రక్తము
1 యోహాను 1:7-10
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము ; మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
ఈరోజు యేసు రక్తమును గూర్చి కొన్ని మాటలు మనము ధ్యానించుకొందాము. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూలోకంలో ప్రతి మనిషికి రక్తము అనేది చాల ముఖ్యమైనది, దానిని బట్టి అనేకమైన వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ రక్తము మనకు తల్లి గర్బములో నుండి మనకు వస్తుంది, అది అందరికి చూడడానికి ఒకే లాగా ఉంటుంది కానీ దానిని పరీక్ష చేస్తే దానిలో అనేక రకములుగా ఉంటుంది. మనిషి రక్తము శారిరకముగా కలుషితముగా ఉన్నది మరియు అధ్యాత్మికముగా మనిషి చేసిన పాపములను బట్టి ఇది కలుషితముగా ఉన్నది. కానీ యేసయ్య రక్తము పరిశుద్దమైనది, గొప్పది. అది మనలను నీతిమంతులుగా తీర్చును అయితే మనం యేసురక్తము గూర్చి ధ్యానిస్తే ఏమి చేస్తుంది ఈ రక్తము మన కొరకు అని మనం ఆలోచిస్తే
అపొస్తలుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
యేసయ్య రక్తము కల్మషము లేనిది మరియు పరిశుద్దమైనది, అటువంటి ఆయన రక్తమును ఇచ్చి అయన తన సంఘమును సంపాదించుకున్నాడు. ఈ సంఘము అంటే ఎవరు అని అంటే మనమే, అంటే అయన తన రక్తమును ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. అంటే మనము ఈ రోజున అయన సంఘము, కావున ఈ సంఘము ఎలాఉండాలి అంటే, పరిశుద్ధంగా ఉండాలి. ఈ సంఘము నీతివంతముగా ఉండాలి, ఇది మహిమ గల సంఘముగా ఉండాలి అని అయన ఆలోచన.
ఇంకా మనము చుస్తే యేసు పరిశుద్ద రక్తమును బట్టి మనకు కలిగి ప్రయోజనము ఏమిటి అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంధములో మనం చుస్తే
1.యేసు రక్తము మనలను పాపము నుండి శుద్ధి చేసి పవిత్రులుగా చేయును.
1 యోహాను 1:7
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
మన రక్తము శుద్దికరించబడాలి అని అంటే క్రీస్తు ప్రభువారి రక్తము మనలోనికి ప్రవేశించాలి, అప్పుడు మనము ఆయనతో అన్యోన్యసహవాసము గలవారమై యుందుము అప్పుడు ఆ రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. మనము చీకటి నుండి వెలుగులోనికి రావాలి అని అంటే మనము శుద్ధికరించబడాలి
2. క్రీస్తు రక్తము ద్వారా దేవునికి మనలను సంధి చేస్తుంది .
కొలొస్సయులకు 1:20
ఆయన సిలువరక్తము చేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను.
అయన పరమతండ్రికి మనకు మధ్య సంధి సహవాసము క్రీస్తు రక్తము ద్వారా కలిగింది ఆనాడు ఆదాము యొక్క అవిధేయత వలన మనలో పాపము ప్రవేశించింది. ఆ పాపము మనలను దేవునికి దూరము చేసింది. ఆ పాపము నుండి దేవునికి మనలను క్రీస్తు యొక్క సిలువరక్తము చేత మనలను సంధి చేసారు. క్రీస్తు రక్తము మనకు దేవునికి ఒక బందము కలుగజేస్తుంది.
3. యేసయ్య రక్తము వలన మనకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది.
ఎఫెసీయులకు 1:7
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
యేసురక్తము వలన మనకు ఏమి కలిగినది అని అంటే దేని నుండి మనకు విమోచన అని అంటే మన పాపపు బానిస బ్రతుకులకు విమోచన కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజున మన పాపములకు విమోచన మనకు క్షమాపణ కలిగించేది యేసురక్తం మాత్రమే అని గట్టిగా ఈరోజున మనం చెప్పగలగాలి.
4.యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ది చేస్తుంది.
హెబ్రీయులకు 9:14
నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్దిచేయును. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అని ఉంటుంది ఆ మనస్సాక్షి శుద్దికరించబడాలి.
ఎందుకు మనం శుద్దికరించబడాలి అని అంటే
తను చేసిన పాపములకు శుద్దికరించబడాలి, తను చేస్తున్నది మంచో చెడో అర్దము చేసుకోవాలి. ఈ మనసు మనలను కొన్ని సార్లు ఖండిస్తుంది. అందుకే మనస్సాక్షి శుద్దికరించబడితే ఆమనిషి మంచి పనులు చేస్తాడు. మనస్సాక్షి శుద్దికరించబడితే ఆ మనిషి దేవుని సేవిస్తాడు.
ఎందుకు ఈ మనస్సాక్షి శుద్దికరించబడాలి అని అంటే
మన యొక్క నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు, మనం నిత్యమూ జీవము గల దేవుని ఆరాధించు’వారిగా ఉండాలి. ఆత్మ సంభందమైన జీవము కలిగిన క్రియలు కలిగి ఉండాలి. నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టాలి. అప్పుడే మన మనస్సాక్షి శుద్దికరించబడుతుంది. మనం జీవముగల దేవుని మాటలను అనుసరించాలి. క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్దికరిస్తుంది.
5.యేసురక్తము వలన మనకు దైర్యము కలుగుతుంది.
హెబ్రీయులకు 10:20
ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,
ఈరోజున దేవుని పరిశుద్ద ఆలయంలో ఉన్నాము అని అంటే అయన రక్తము వలనే, అయన రక్తమే మనలను అయన పాద సన్నిదికి తీసుకువస్తుంది. మనకు దైర్యమునిస్తుంది అయన రక్తము.
6.యేసు రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుంది.
రోమీయులకు 5:9
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింప బడుదుము.
మనం ఈరోజున నీతిమంతులుగా మారాలి అని అంటే అయన యొక్క రక్తము ద్వారానే అది సాధ్యము. యేసయ్య నీతి పరుడు అయన బిడ్డలుగా మనం కూడా నీతి కలిగి జీవించాలి.
ఈరోజున మనం మన యొక్క పరిస్టితిలను జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, నిర్జీవమైన క్రియలను విడిచి మంచి మనసాక్షిని కలిగి అయన పరిశుద్ద రక్తము ద్వారా మనం కడగబడి యేసయ్య అమూల్యమైన రక్తము ద్వారా పవిత్రపరచబడి శుద్ధికరించబడి యేసయ్య కొరకు జీవించాలి యేసయ్య ఇచ్చు ఆశీర్వాదాము పొందుకోవాలి అని అట్టి కృప అందరికి కలుగును గాక ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
*********************************************************
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య రెవ. శామ్యూల్ గారు
(విశ్వవాణి స్టేట్ జనరల్ సెక్రటరి)
అంశం : దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడు.
మీకా 6:6-8
8 మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
ఈ మీకా గ్రంధము క్రీస్తు పూర్వము 740-710సం.లోవ్రాయబడినది ఆ కాలంలో యెషయా మీకా ఇద్దరు ప్రవక్తలు ఎక్కువగా దేవుని పరిచర్య చేసేవారు. దేవునికి, ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే యాజకులను వారిని మీకా ప్రవక్త ఖండిస్తూ బ్రతికిన దినాలు ఉన్నాయి. అలాంటి సందర్భములో మీకా ప్రవక్త పలికిన మాటలు చదవబడిన వాక్యములో మనం చూస్తాము. సాధారణముగా మనము అనేకమైన విషయాలను గూర్చి ప్రభువును ఎక్కుగా అడుగుచు ఉంటుంటూ ఉంటాము ప్రభువు కృప గలిగిన వాడు జాలి కలిగిన వాడు కనుక మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యదికముగా ఇస్తూనే వున్నారు. దేవుని మహిమ కలుగును గాక. అయన ప్రేమ పూర్వక వాగ్దానమును ఎప్పుడు మర్చిపోలేదు.
ఈరోజున అంశము ప్రభువు నిన్ను ఏమి అడుగుచున్నాడు అని మనం ఆలోచిస్తే
దేవుడు కుడా మనలను అడుగుతాడు, దేవుడు మన నుండి ఆశిస్తాడు అనే గొప్ప సందేశమును వాక్యములో మీకా ప్రవక్త ప్రజలకు అందిస్తున్నాడు. ఐతే ఏమిటి ప్రభువు మనలను అడుగుచున్నాడు. ప్రభువు బలులను, వెండి బంగారమును అడుగుట లేదుగాని, న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మన ప్రతి దిన జీవితములో న్యాయమును అనుసరించి నడుచుకో, కనికరమును ప్రేమించు, దీనమనస్సు కలిగి ప్రేమించు. దీనిని నడుచుకో అని ప్రభువు మనలను ఈరోజున ఆడుగుచున్నారు. ఏది చేయాలో అది చేయడం ఎలా నడచుకోవాలో ఆవిధంగా నడచుకోవడం, న్యాయముగా నడుచుకోవడం ప్రభువు ఈరోజున అడుగుచున్నారు ఇది చాల కష్టమైన పని కాదు. మన అర్పణలు ధర్మకర్యములు కాదు గాని, ప్రభువు చెప్పే ఈ మూడు విషయాలు మన చేయగలిగితే దేవుడిచ్చే పరిపుర్ణమైన ఆశీర్వదాలను పొందుకోగలము. మనం ఈ దినాలలో దేవుడు మనలను దీవించాడు అని కొన్ని విషయాలను చూసి అనుకుంటూ ఉన్నాము. మనకున్న సౌకర్యములను బట్టి మన బిడ్డల ఉద్యోగమును బట్టి మన స్తితి గతులను బట్టి మనం అనుకుంటాము దేవుడు మనలను బాగా దీవించాడు అని వాస్తవంగా దేవుని యొక్క పరిపుర్ణమైన దీవెన మనం అనుభవించడం లేదు అని మనం తెలుసుకోవాలి.
దేవుని యొక్క పరిపుర్ణమైన దీవెన అనుభవించాలి అని అంటే ఉత్తమైనవి ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. వాటిని మన జీవితంలో చేయగలగాలి, ఏమిటి దేవుడు మన నుండి ఆశిస్తున్నవి అని మనం ఆలోచిస్తే
1. మొదటిగా న్యాయముగా నడచుకోనుట.
న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము అని దేవుని వాక్యం చెప్తుంది.
యెషయా గ్రంథము 61:8
ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.
ఒక మానవునిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక విశ్వాసిగా, ఒక ఉద్యోగిగా తన ధర్మమును నడచుకొని ఉండుట దేవునికి ఇష్టము న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము అని దేవుని వాక్యము చెప్తుంది. కానీ మనం అన్యాయము చేస్తే మనం చాల ఆలోచించాలి. ఒక వేళ మనం దేవుని దృష్టికి న్యాయము చేస్తే వారితో దేవుడు ఒక నిత్యనిభందన చేస్తాడు.
ఏమిటి ఆ నిత్య నిభందన అని మనం బైబిల్ గ్రంధములో చుస్తే., అనగా మనం ఏది చేయాలో అది చేస్తే వారితో నిత్య నిభందన చేస్తాను అని దేవుని వాక్యం చెప్తుంది.
లూకా సువార్త 2:13-14
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి 14 సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
యేసు ప్రభువారు లోక రక్షకునిగా ఈ లోకమునకు వచ్చినపుడు చోటుచేసుకున్న సంఘటన ఇది. న్యాయముగా నడచుకోనుట నాకు ఇష్టం, ఎవరైనా నాకు ఇష్టమైన పని చేస్తే వారి యెడల నా నిభందన చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఏమిటి ఆ నిభందన అని అంటే వారిని నా సమాధానముతో నింపుతాను అని దేవుని వాక్యము చెప్తుంది. ఈ భూలోకంలో ప్రాధాన్యమైన అంశము ఏదైనా ఉన్నది అని అంటే అది సమాధానము. ప్రియులారా దేవుని బిడ్డలారా ఈరోజున అనేకమైన కుటుంభాలు మరియు దేశములు సమాధాన కొరతతో అల్లడిపోతున్నాయి. భయంకరమైన భయానక పరిస్తితులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అని అంటే సమాధానము లేకనే., లోకములో ఎక్కడ శాంతి సమాధానము లేదు. ఈరోజున మనం సంఘ, కుటుంభ జీవితములో నిజమైన సమాధానమును అనుభవించగలిగాను అని దైర్యముగా చెప్పాగలుగుతున్నామా ఆలోచించుకోవాలి. దేవుని పరిపుర్ణమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేక పోతున్నాము ఎందుకు అని అంటే మనం ఇంకను అన్యాయము చేస్తున్నాము. ఇశ్రాయేలీలు జీవితములో మీకా ప్రవక్త మాట్లాడుచున్న మాటలు మీరు అన్యాయముగా నడచుకోనుచున్నారు కనుక న్యాయముగా నడచుకోవాలి అని చెప్తున్నారు. ఎవరు న్యాయముగా నడచుకొంటారో వారు దేవునికి ఇష్టులై ఉంటారు. దేవుడు వారితో తన నిభందన స్తిరపరుస్తాడు.
దేవుని వాక్యములో మోషే ద్వారా దేవుని ప్రజలకు ఇస్తున్న సందేశము కేవలము న్యాయముగా నడచుకోనుట.
ద్వితీయోపదేశకాండము 16:20
నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొను నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొన వలెను.
కేవలము న్యాయముగా నడిస్తే అయన చేత మన కొరకు దాచి ఉంచబడిన ఆశీర్వదమును అనుభవిస్తాము అని దేవుడు మనకు చెప్తున్నారు. దేవుని నిభందన యవత్ పరలోకము మానవునికి ఇవ్వలనుకొనుచున్న ఆశీర్వాదము భూమి మీద సమాధానము కలిగి జీవించడము దానిని అనుభవించడమే. అటువంటి దీవెన దేవుడు మనకు ఇస్తాడు మనము న్యాయముగా నడిస్తే.
2. రెండవదిగా మనం కనికరమును ప్రేమించడము నేర్చుకోవాలి.
యోబు గ్రంథము 29:15-16
గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.
దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచా రించితిని.
కనికరము చూపించడం వేరు కనికరమును కలిగి ఉండటము వేరు., కనికరమును ప్రేమించడము వేరు. ఇది చాల అధికమైన మాట. యోబు మాటలను మనం గమనిస్తే గ్రుడ్డివారికి చుడలేక పోవలేకపోవుచున్నానే, కుంటి వారికీ నేను నడవలేకపోవుచున్నానే అనే భాద కలుగకుండా చేయడం అనేది గొప్ప కనికరము చూపడం, కనికరమును ప్రేమించడము అని మనం తెలుసుకోవాలి. ఈరోజున కనికరమును ప్రేమించడము అని అంటే. ఎదుటివారి అవసరమును చూచి మనం కదిలించబడి వారి అవసరత తీర్చడంలో నూరుశాతం పరిపూర్ణత కలిగి చేయడం అది యోబు తన జీవితంలో కలిగించాడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని అయన జరిగించాడు.
యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగములో ఈ కనికరమును గూర్చి పలికిన మాటలను మనం చుస్తే.
మత్తయి సువార్త 5:7
కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
ఎదుటి వారిపై మనం కనికరము కలిగి వారి అవసరములు తీర్చగలిగితే మన అవసరములు కూడా తీర్చబడతాయి. ప్రభువైన యేసుప్రభువారు ఐదు వేలమందికి మూడు దినములు ప్రసంగించిన తరువాత బైబిల్ గ్రంధములో వ్రాయబడిన మాటలను మనం గమనిస్తే అయన కనికరము చేత కదిలించబడ్డాడు అని వ్రాయబడింది. ఈరోజున కనికరముతో మనం ప్రేమించాగలిగితే మనం కనికరించబడుతాము. ఆవిధంగా ఎదుటివారి అవసరతలలో మనము శక్తి వంచన లేకుండా పాలుపంతులు కలిగి ఉండాలి. ప్రేమించడం అని అంటే ఎప్పుడు గుర్తు చేసుకోవడం. ఎప్పుడో ఒక సారి కాదు. నిత్యమూ కనికరమును ప్రేమించేవారిగా మనం ఉండాలి.
3. ఆత్మ విషయంలో దీనమనస్సు కలిగి ఉండాలి.
లూకా సువార్త 17:10
అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
ఈరోజున మనకు అతిశయము ఎప్పుడు వస్తుంది అని అంటే మనము చేయగలిగినది చేసినప్పుడు మనకు గుర్తింపు వస్తుంది. మనం అటువంటి పరిస్తితి గుండా వెళ్ళినపుడు మనం అతిశయిస్తము, నేను కాబట్టి, నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి చేయగలిగాను. ఒక విధమైన గర్వము అని ప్రభువు చెప్తున్నాడు. కానీ దేవుడు నీ నుండి నా నుండి ఏమి ఆశీస్తున్నాడు అని అంటే న్యాయముగా నడచుకోనుట, కనికరమును ప్రేమించుట, దీనమనస్సు కలిగి ఉండుట. దీనమనస్సు అని అంటే గొప్ప కార్యములు చేసి అతిశయించరాదు. మేము ఎవరము అని అంటే నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను. ఆవిధంగా మనం అనుకోవాలి, ఆవిధంగా మనం దేవుని యెడల ప్రవర్తించాలి. అటువంటి దీనత్వము మనం కలిగి ఉండాలి. మనం ఏమి చేసిన మన మనస్సులో అటువంటి అతిశయము కలిగి ఉండరాదు. అటువంటి దీనత్వము మనం ప్రభువులో కలిగి ఉండాలి. ఈరోజున మనం ఎంత ధనవంతులమైన, ఎంత శక్తిశాలివైన, నీవు జ్ఞానవంతుడవైన, ఎంతగొప్పవాడవైనా మన ప్రభువు చెప్పిన, అయన చూపిన దీనత్వము మనము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి యొక్క నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అని దేవుని వాక్యము చెప్తుంది. మనం ఈరోజున మనం ఎంత గొప్ప కార్యములు చేసిన మనం నిష్ప్రయోజకులమైన దాసులము అని గ్రహిస్తే దేవుడు వారిని అత్యదికముగా హెచ్చిస్తాడు.
ఆత్మలో దీనత్వము కావాలి అని దేవుని వాక్యము చెప్తుంది.
మత్తయి సువార్త 5:2-3
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
మానవుని జీవితంలో అత్యదికమైన ధ్యన్యత ఏమైనా ఉన్నది అని అంటే అది పరలోకరాజ్యం చేరడమే.
ఎందుకు ఈ భక్తి, ఈ సమర్పణ అని అంటే అది కేవలం పరలోక రాజ్యము వెళ్ళడానికే. మన యొక్క గురి, గమ్యము, కేవలం పరలోక రాజ్యము చేరడమే. ఆ ఉన్నతమైన స్తితి స్తాయి కావాలంటే మనం ఏమి చేయాలి అని అంటే మన మనస్సులో దీనత్వము కావాలి., ఆత్మలో దీనత్వము కావాలి.
దీనమనస్సు కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదము ఏమిటి మనము ఆలోచిస్తే
అయన మనతో, మనము ప్రభువుతో ఉండే ఆశీర్వాదము కలిగి ఉండటము.
యెషయా గ్రంథము 57:15
మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
గొప్ప దేవుడు ఈరోజున మనతో ఉండాలి అని అంటే మనం దీనమనస్సు కలిగి ఉంటే దేవుడు మనతో ఉండడానికి అయన ఇష్టపడుచున్నాడు.
ఈరోజున మనం ఎంత సేపు దేవుని అది కావాలి ఇది కావాలి అని ఆయనను అడగడమే కానీ, ప్రభువు మనలను ఏమి అడుగుచున్నాడు మనం ఎప్పుడైనా ఆలోచించామా దేవుని వాక్యం చెప్తుంది న్యాయముగా నడచుకోవాలి, కనికరమును ప్రేమించాలి. ఆత్మ విషయంలో దీనమనస్సు కలిగి ఉండాలి అని ఈరోజున మీకా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఎదుటివారి అవసరతలలో సహాయం చేయుట నేర్చుకోవాలి, అయన కోరుచున్నట్లుగా నడచుకొని దేవుడిచ్చు గొప్ప ఆశీర్వాదము అయన మనతో ఉండే గొప్ప భాగ్యము మనం పొందుకోవాలి అట్టి కృప మనం అందరము కలిగి ఉండాలి.
యేసయ్య ఈ మాటలను దీవించును గాకా ఆమెన్..
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
***************************************************************
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం: బుద్ధిమంతుడు – బుద్దిహీనుడు
మత్తయి సువార్త 7:24-27
24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. 25వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. 26మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
ఈరోజున మనం ధ్యానించు కాబోయే అంశం బుద్ధిమంతుడు-బుద్దిహీనుడు, చదవబడిన వాక్యములో మనం చుస్తే బుద్ధిమంతుడు అనగా వివేకము కలిగిన తెలివికలిగిన మనుష్యుడు అని అర్ధం. బుద్దిహినుడు అనగా మూర్కుడు అని అర్దమునిస్తుంది. ప్రియులారా సామెతలు గ్రంధములో మనం చుస్తే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో, బుద్దిహీనుడు ఎలా ఉంటాడో మనం చూస్తాం. బుద్దిమంతులు మూడు విధాలుగాను, బుద్దిహీనులు మూడు విధాలుగాను ఉంటారు అని ఉదాహరణలతో బైబిల్ గ్రంధములో మనం చూస్తాం అవి ఏమిటో మనం వివరంగా ఈరోజున ధ్యానించుకొందాము.
1.మొదటిగా ఈ బుద్ది ఏమి చేస్తుంది మనం చుస్తే
బుద్ది మనలను కాపాడును అని దేవుని వాక్యం చెప్తుంది
సామెతలు 2:11
బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
బుద్ది అనేది ఆవ్యక్తి యొక్క తెలివికి ప్రవర్తనకు సంభందించినది. బుద్దిమంతులు అనేవారు తల్లి తండ్రులకుగాని, సమాజానికిగాని, దేశంనకు గాని మేలు చేస్తారు. కానీ బుద్దిహీనులు వారికీ అవమానము తీసుకువస్తారు. బుద్ది కలిగి జీవిస్తే ఆ బుద్ది మనలను కాపాడును అని దేవుని వాక్యము చెప్తుంది, మనం ఆప్రకారం జీవించాలి.
2.ఈ బుద్దిమంతులు ఎలా ఉంటారు అని దేవుని వాక్యమును పరిశిలిస్తే
దానియేలు 12:3
బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. వారు వెలుగువలే వుంటారు. అందుకే మానవులమైన మనకు ఈ బుద్ది చాల అవసరం, ప్రాముఖ్యంగా క్రైస్తవులమైన మనకు మరింత అవసరం. బుద్ది కలిగి ప్రవర్తిస్తే వారి జీవితం చాల బాగుగా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది.
3.బుద్దిహీనులు లేదా బుద్దిలేనివారు ఎవరు అని దేవుని వాక్యము చెప్తుంది మనం చుస్తే
దేవుడు లేడు అని ప్రవర్తించువారు బుద్దిహీనులు అని దేవుని వాక్యం చెప్తుంది
కీర్తనల గ్రంథము 14:1
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
దేవుడు లేడు అని అనేవారిని నాస్తికులు అని అంటాము, అటువంటివారు దేనికి భయపడరు, వారు చెడ్డకార్యములు చేయుదురు. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు కొంచెమైన భయపడతారు. ప్రియులారా మనం ఆలోచిస్తే మనకు తెలుసు దేవుడు లేనిదే ఈ భూప్రపంచము ఎలా పుట్టింది. దేవుడు ఉన్నాడు అని, ఈప్రపంచము ఎలా పుట్టిందో తెలియజెప్పేదే మన బైబిల్ గ్రంధము. ఈరోజున దేవుడు లేడు అని అనుకోనువారు మనలో కూడా అటువంటివారు ఉన్నామా ఆలోచించుకోవాలి. దేవుడు ఉన్నాడు ఆయనే మన సృష్టికర్త, ఆయనే మనలను సృజించినవాడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన పాపములను విడిపించగల దేవుడు. ఆయనే మన సమస్త పాపముల నుండి, భాదల నుండి రక్షించే దేవుడు ఆయనే మన ప్రభువైన యేసు.
బుద్దిమంతుడైన యోభు యొక్క జీవితంను మనం జ్ఞాపకం చేసుకుంటే
యోభు అయన బుద్ధిమంతుడు, అయన భార్య బుద్దిహీనురాలు, అయన తన ఆస్తిపాస్తులు కోల్పోయిన, తన బిడ్డలను కోల్పోయినా, తన యొక్క శరీరము క్షీనించిపోయినా అయన దేవుని విడిచిపెట్టక ఆయనను స్తుతిస్తున్నాడు. అన్ని కోల్పోయిన అయన తన దేవుని శాశ్వతమైన రాజ్యములో ఉంటాను అని నమ్మాడు. చివరికి తన భార్య దేవుని విమర్శించినా అయన దేవుని విడనాడలేదు. క్రైస్తవులమైన మనం కుడా మనకు శ్రమలు వచ్చినపుడు, కష్టాలు వచ్చినపుడు దేవుని మీద నిందలు వేస్తున్నామా ఆలోచించుకోవాలి. ఈరోజున దేవుని నమ్మినవారు కుడా దేవుడు ఉంటే మనకు ఈ భాదలు ఉంటాయా, ఈ కష్టాలు ఉంటాయా అని బుద్దిహీనులు మాట్లాడుతారు. మేలులను స్వీకరిస్తూ, కీడు కలిగినపుడు దేవుని విమర్సిస్తున్నమా. దేవుని బిడ్డలుగా సంతోషమును, కష్టములను స్వీకరించాలి. ఈరోజున మనం ఎలా ఉన్నాము మనలను మనం పరిశీలించుకోవాలి.
బైబిల్ గ్రంధములో బుద్దిహీనులు ఎవరు వారు ఎలా ఉంటారు అని మనం చుస్తే
బుద్దిహీనుడైన నాబాలును గూర్చి బైబిల్ గ్రంధములో ఒక సంఘటనను మనం చుస్తే
1సమూయేలు 25:25
నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.
అబీగయీలు దావీదును కనుగొని, గార్దభము మీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము; నాబాలు మోటుతనము గలవాడు, అని తన భర్త పక్షముగా ఆయనను క్షమించమని ప్రాదేయపడుతుంది. ఇక్కడ ఎవరు భక్తి కలిగిన వారు అని మనం చుస్తే భార్య బుద్దిమంతురాలు, భర్త బుద్దిహీనుడు. ఈరోజున ముర్కపు స్వభావము, బుద్ది లేని స్వభావము కల్గినటుంటివారు చాల మంది ఉన్నారు. సోలోమోను మహా జ్ఞాని అంటాడు బుద్దిలేని పడుచువాడు ఒకడు ఉన్నాడు అని అంటాడు. ప్రియులారా బుద్దికలిగిన వారు చెప్పినట్లుగా వింటారు, వారు తల్లితండ్రుల మాట వినేవారు. పెద్దవారు చెప్పినపుడు, ఎవరు మంచి చెప్పిన వింటారు, కానీ బుద్దిలేని పడుచువారు వారు ఎవరి మాట వినరు. నాబాలు అంటాడు ఎవరు దావీదు, యెహోవా ఎవరు అని అంటున్నాడు దేవుడు అతనిని మొత్తగా అతడు మరణించెను. ఈరోజున అటువంటి బుద్దిలేని స్వభావం ఎవరిలో ఉండరాదు. ఈరోజున మనం దేవుని ఎదుట బుద్ది కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి.
ధనవంతుడైన మరియొక బుద్ది హీనుడును గూర్చి బైబిల్ గ్రంధములో మనం చుస్తే
లూకా సువార్త 12:17-19
నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని 19 నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము,
తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.
దేవుని మాటలను మనం చుస్తే ఒక ధనవంతుడు తన ప్రాణముతో అంటాడు నా ప్రాణముతో ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనెను. ఆవిధంగా మనం ప్రవర్తించరాదు.
4.బుద్దిమంతుని మాటలు ఎలా ఉంటాయి బైబిల్ గ్రంధములో మనం చుస్తే
కీర్తనల గ్రంథము 103:1
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
బుద్ధిమంతుడు నిత్యమూ ఆయనను స్తుతిస్తాడు, మనం కూడా దేవుడు చేసిన మేలులుకు కృతజ్ఞత కలిగి అయన స్తుతించాలి, ఆయనను సన్నుతించాలి, ఈరోజున మనం ఎలా ఉంటున్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అని యేసుప్రభువారు చెప్తున్నారు అని అంటే
మత్తయి 7:24
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.
ఈ బుద్దిమంతుని యొక్క ఆలోచనవేరుగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ ఆలోచన అని అంటే ఒక బలమైన స్తలములో ఇల్లు నిర్మించడానికి ఆలోచన చేసి కట్టడానికి సిద్దపడతాడు. యేసుప్రభువారు చెప్పే ప్రతి మాట ఒక రాతి వంటిది, అటువంటి అయన ప్రతిమాటను మనం తీసుకోని మన కుటుంభాన్ని కట్టుకోవాలి, ఆత్మీయమైన ఇల్లును కట్టుకోవాలి, దేని ద్వారా అని అంటే అది కేవలం అయన వాక్యము ద్వారా మాత్రమే. అందుకే అయన మాటలను మనం విని ఆ ప్రకారం నడచుకోవాలి. అప్పుడే మనం బుద్దిమంతులుగా పోలియుంటాము, ఆయనను నిత్యమూ స్తుతించే వారిగా ఉండాలి, దేవునిలో బలపడాలి.
బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు అని యేసుప్రభువారు చెప్తున్నారు అని అంటే
మత్తయి 7:26
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
దేవుని మాటలను విని ఆ ప్రకారం చేయుక, ఆ ప్రకారం నడచుకోపోతే మనం ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పోలియుంటాము అని దేవుని వాక్యము ద్వారా యేసయ్య మనతో మాట్లాడుచున్నారు. ఈరోజున అటువంటి గుంపులో మనం ఉండరాదు.
5.బుద్ది మంతులు బుద్దిహీనులు ఎవరు అని అంటే.
బైబిల్ గ్రంధములో బుద్ది కలిగిన గుంపు రెండవారు బుద్దిలేని గుంపు వారి ప్రవర్తన ఎలాఉంది అని మనం చుస్తే
మత్తయి 25 1-4
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి.
పెండ్లి కుమారుడు అయన రాకడను గూర్చి కన్యకలు ఐదుగురు సిద్దపడి వెళ్లారు, మిగతావారు సిద్దపడలేదు, అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడినప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
ఈరోజున మనం ఎలా ఉంటున్నాము, మన భవిష్యత్తు ప్రణాళికను ఎరిగి సిద్దపడి ఉన్నామా, జాగ్రత్తగా ఉన్నామా, దేవుని కొరకు అయన రాకడ కొరకు సిద్దపడి ఉన్నామా, తరువాత చూసుకుందాము అని అనుకుంటున్నామా, ప్రభువును కలిగి ఉంటున్నామా. అయన కొరకు జీవిస్తున్నమా ఆలోచించుకోవాలి.
ప్రియులారా ఈరోజున దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే బుద్ది మనలను కాపాడుతుంది, బుద్ది మనలను వెలిగింప జేస్తుంది, బుద్ది మనకు కీర్తి ప్రతిష్టలను తీసుకువస్తుంది. బుద్ది మనలను ఆశీర్వదింపజేస్తుంది. బుద్ది సర్వసంపదలను కల్గిస్తుంది, బుద్ది మన కుటుంభాన్ని క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను కట్టుకోవడానికి సహాయపడుతుంది. అటువంటి బుద్దికలిగి మనం దేవుని వాక్యంనకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, సేవకులకు లోబడాలి, ప్రతి విషయమునకు లోబడి జీవించడం నేర్చుకోవాలి. యోభువలే కష్టమొచ్చిన, నష్టమోచ్చిన దేవునికి లోబడి జీవించాలి, అయన ఆశీర్వాదము పొందుకోవాలి ఆమెన్.
యేసయ్య ఈ మాటలు దివించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*******************************************
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : అమర్చుకోనుడి
2 పేతురు 1:5-7
5ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, 6జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, 7సహనము నందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.
చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే మనలను మనం అత్మీయముగా అమర్చుకోవాలి అని చెప్తుంది. అత్మీయముగా అమర్చుకోవాలంటే మనలను మనం కట్టుకోవాలి, ఈరోజున మన ఇల్లును మనం అమర్చుకొంటాము, అదేవిధంగా మన ఆత్మీయ జీవితమును కూడా మనం అమర్చుకోవాలి దేనిలో అమర్చుకోవాలి అని అంటే పేతురు ద్వారా దేనితో మనలను మనం అమర్చుకోవాలో దేవుడు మనతో చెప్తున్నాడు.
ఇక్కడ మనం ఏమి అమర్చుకోవాలి అని దేవుని వాక్యము చెప్తుంది అని మనం చుస్తే అంటే విశ్వాసమును, సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమను, దయను వీటి అన్నిటితో మన ఆత్మీయ అమర్చుకొనుడి అని దేవుని వాక్యము చెప్తుంది. వీటిలో ఏ ఒక్కటి మనలో లేకపోయినా మన ఆత్మీయ జీవితము అనే ఇల్లు కట్టబడదు.
1.మొదటిగా విశ్వాసం:
విశ్వాసం క్రైస్తావ జీవితానికి చాలా అవసరం. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనం దేవునిలో పరిపుర్ణమైన విశ్వాసం కలిగినవారిగా అయన యెడల గొప్ప నమ్మకం కలిగినవారమై ఉంటే దేవుడు ఏమిచేప్తే అది చేస్తాము. అంతగా దేవునిలో మన ఆత్మీయ ఇంటిని కట్టుకోవడానికి ఈ విశ్వాసం అనునది చాలా అవసరం.
ఎటువంటి విశ్వాసం మనకు కావాలి అని మనం ఆలోచిస్తే
క్రియలతో కూడిన విశ్వాసం మనకు కావాలి. హేబెలు విశ్వాసంతో కూడిన అర్పణ అయన అర్పించాడు. అంతేకాకుండా హనోకు తన విశ్వాసమును బట్టి 300ఏళ్ళు దేవునితో నడిచాడు. దేవుడు ఏమి చెప్తే అది చేస్తూ ఆయనతో నడిచాడు. దేవునిని ఆయన విడిచిపెట్టలేదు, దేవుని మాటను విడిచి పెట్టలేదు. అంత గొప్ప విశ్వాసం కల్గినవాడు. దేవుని మీద విశ్వాసం మనకు ఉంటే మనం పరలోక రాజ్యమును స్వత్రించుకుంటాము. అనేకమైన భక్తులైన వారు అయన యందు విశ్వాసము ఉంచి పరలోకరాజ్యమును పొందుకున్నారు. మనం శాశ్వతంగా ఉండాల్సినది దేవుని రాజ్యములోనే. అది చాల శ్రేష్టమైనది. భక్తులైనవారు వారికీ వాగ్ధానదేశములోనికి చేరక పోయినా దానికంటే శ్రేష్టమైన రాజ్యము ఉంది అని దేవుని యెడల విశ్వాసము ఉంచి చనిపోయారు. మోషే వాగ్ధాన దేశమైన కనాను దేశము దొరకపోయినా దానికన్నా శ్రేష్టమైన పరలోకరాజ్యము ఉంది అని వారి జీవితాలను త్యాగము చేసారు. కనుక మన విశ్వాసము ఎంత ఉంది అని మనలను మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం పరలోకరాజ్యము చేరుకోము.
2.రెండవదిగా విశ్వాసము కల్గిన వారికీ సద్గుణము కావాలి.
గుణవతైన భార్య దొరకుట అరుదు ఆమె ముత్యము వంటిది అని సోలోమోను గారు పలికారు. అటువంటి భార్య కలిగిన ఇల్లు ఎలా ఉంటాదో అయన తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలుగా సంఘమనే ఇంటిలో మనం గుణవంతులుగా ఉండాలి. సమాజంలో మంచి గుణం కలిగి ఉండాలి.
ఈ సద్గుణము ఎలా వస్తుంది ఎలా తెలుస్తుంది అని అంటే
ఆ వ్యక్తి మాట్లాడే విధానం బట్టి ఆ వ్యక్తి లోబడే విధానము బట్టి తెలుస్తుంది. ఆవ్యక్తి యొక్క ప్రవర్తనే మనకు తెలుపుతుంది. అందుకే మనం నిందారహితులుగా ఉండాలి విశ్వాసం కావాలి ఆ విశ్వాసముతో పాటు సద్గుణము కూడా కావాలి. నోవాహు నితిమంతుడును నిందారహితుడు అని దేవుని వాక్యము చెప్తుంది. ఈ దినాన మనలో తప్పులను చూపిస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. మనలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. అలాకాకుండా దుర్గుణము కలిగి మాట్లాడరాదు. ప్రియులారా క్రైస్తవుడు సద్గుణము కలిగినవాడు. ఎందుకు అని అంటే క్రీస్తును కలిగినవాడు కాబట్టి. అయన మాటలో వినయము సహనము ప్రేమ ఇది అంత సద్గుణమే. దేవుని బిడ్డగా కట్టబడాలి అని అంటే మనకు కావాల్సింది ఈ సద్గుణమే.
3.మూడవది సద్గుణముతో పాటుగా జ్ఞానము ఉండాలి.
జ్ఞానము అనేది లోకసంభందమైన జ్ఞానము కాదు గాని, మనకు పర సంభందమైన జ్ఞానము కావాలి. లోకసంభందమైన జ్ఞానము మనం బ్రతకడానికి ఉపయోగపడుతుంది. సమాజంలో మనం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. ఆత్మసంభందమైన జ్ఞానము సాతాను పన్నాగాల నుండి మనం ఎలా తప్పించుకోవాలో చెప్తుంది. ఈలోకం విడిచిన తరువాత మనం ఎక్కడకి వెళ్తామో మనకు తెలుపుతుంది. పరలోకానికి ఎలా వెళ్తామో మార్గాన్ని మనకు చూపిస్తుంది. సత్యమైన జీవితాన్ని మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి, దేవునిలో ఎదగాలి. ప్రార్దించాలి. దేవునితో సవాసం కలిగి ఉంటే ఆ జ్ఞానము మనకు లబిస్తుంది. కాబట్టి ప్రియులారా మనకు విశ్వాసంతో కూడిన సద్గుణము ఉండాలి, దేవునిలో ఆత్మ జ్ఞానము మనం కలిగి ఉండాలి. అది మనలను పరలోకమునకు నడిపిస్తుంది.
4.నాల్గవదిగా అత్మజ్ఞానములో అశానిగ్రహము కలిగి ఉండాలి.
ఈ ఆశ అనేది మనిషిని పాడు చేస్తుంది. ఆశ ఉండవచ్చు దురాశ ఉండరాదు. తనకు ఉన్నదాని కంటే ఇంకా ఎదోకావాలి అని అనుకోనుటయే దురాశ. ఉన్నదానితో సరిపెట్టుకోవాలి. పక్కవాడిలాగా నాకు కావాలి అనుకోనకూడదు. ప్రియులారా ఈ దురాశ అనేది మొదటిగా సాతనుడే మనకు నేర్పించాడు. దేవుని సింహాసనము పైగా సింహాసనము వేసుకోవాలి అని అనుకోని దేవుని తక్కువ చేసాడు. దురాశ దుఃఖానికి చేటు ఒక మనిషి తనకు ఉన్నదానితో తృప్తి పడకుండా ఉండటమే దురాశ, ఇది ఎవరికీ మంచిది కాదు. అందుకే ఆశ అనుదానిని మనము నిగ్రహించుకోవాలి. ఈరోజున మనము అది కావాలి ఇది కావాలి అని కోరుకోనకుండా ఆశను నిగ్రహించుకోవాలి. అశ మితిమీరిపోకూడదు. ఆశ దురాశగా మారకూడదు. అన్ని కావాలని అనిపిస్తుంది కానీ మనం నిగ్రహించుకోవాలి. ఆ ఆశను నిగ్రహించుకొంటే వారి జీవితము ప్రకాశవంతముగా ఉంటుంది.
5.ఐదవదిగా ఆశానిగ్రహముతో కూడిన సహనము మనం అమర్చుకోవాలి.
సహనము అనేది ఏవ్యక్తిలో ఉంటుందో వారు విజయాన్ని చూస్తారు. ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి, మన ఇరుగు పోరుగులో, మన సమాజంలో మనం సహనం కలిగి ఉండాలి. ఎంత ప్రమాదకరమైన సన్నివేశామైన సహనముగా ఉండాలి. అలాగే క్రైస్తవ జీవితంలో సహనము అనేది చాలా అవసరం మనం దేవుని కొరకు భాదలలో కష్టములలో సహనము కలిగి ఉండాలి.
6.ఆరవదిగా సహనముతో కూడిన భక్తిని మనం అమర్చుకోవాలి.
భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది, ఈ లోకములో దేవుని నమ్మేవారు యేసుప్రభువారిని కలిగిన మనం భక్తి కలిగి జీవించాలి.
7.ఏడవదిగా సహోదర ప్రేమను మనం అమర్చుకోవాలి
సహోదర ప్రేమ చాల అవసరం. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించాలి అని అంటాడు దేవుడు. ఒక సమరయుడిని గూర్చి ఒక పరిచారకుడిని గూర్చి దేవుడు వివరించాడు. ప్రియులారా గమనించండి సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలి మనలో బేదాలు కలిగి ఉండరాదు. ఒకరు ఆపదలో మనం అదుకోనేవారిగా మనం ఉండాలి. ఈరోజున దేవుని బిడ్డలుగా మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే సహోదర ప్రేమను అమర్చుకోవాలి.
8.ఎనిమిదవదిగా సహోదర ప్రేమ కూడిన దయను మనం అమర్చుకోవాలి.
ఈరోజున మనం సహోదరప్రేమతో కూడిన దయను క వారిగా మనం ఉండాలి. ఈరోజున మనం ఏమి కలిగి ఉంటున్నమో మనలను మనం పరిశీలించుకోవాలి. దేవుని యెడల మనం భక్తిని పెంచుకొని జీవించాలి.
ప్రియులారా ఈరోజున మనం విశ్వాసమును, విశ్వాసముతో కూడిన, సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొని జీవించునట్లుగా అట్టి కృప ప్రభువు మన అందరికి కలిగించును గాక ఆమెన్.
యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
No comments:
Post a Comment